పారమేశ్వరాగమము

పంచాక్షర మంత్ర మహాత్మ్యము

యథా నదీనాం సర్వాసాం పుణ్యా భాగీరథీ శివే।

యథైవ భవతీ సర్వయోషితాం పురుషేష్వహమ్॥ |82|

యథైవ కాశీ క్షేత్రాణాం తీర్థేషు మణికర్ణికా।

మమ పంచాక్షరీమంత్ర: సర్వమంత్రేషు వై యథా॥ |83|

యథైవ సర్వలోకేషు కైలాసస్థానమావయో:।

తథా శైవమతం దేవి విద్ధి సర్వోత్తమోత్తమమ్॥ |84|

హే శివే! సమస్త పుణ్యనదులలో భాగీరథీ (గంగ) వలె, స్త్రీలలో నీవలె, పురుషులలో నావలె, క్షేత్రములలో కాశీక్షేత్రమువలె, తీర్థములలో మణికర్ణికవలె, సర్వ మంత్రములళో నా పంచాక్షరీ మంత్రమువలె, సర్వలోకములలో మన నివాసమైన కైలాసమువలె, (సర్వమతములలోను), శైవమతమును సర్వశ్రేష్టమైనదిగా తెలిసికొనుము.

మమ సర్వోత్తమత్వేన మత్సృష్టత్వాత్ పరస్య చ।

తదేవ తారతమ్యం తే మతే మమ పరత్ర తు॥ |85|

నా సర్వోత్తమత్త్వము చేతను, సమస్తము నాచే సృజించబడుటచేతను నా మతమయిన శైవమతము, ఇతర (మత)ములకన్నా భిన్నమైనది.

యథా వర్ధయతే రాజా భృత్యం కర్మానుసారం।

తారతమ్యపదం దత్త్వా తథైవాహం మతే మమ॥ |86|

ఏ విధముగా సేవకుని సేవానిరతిననుసరించి రాజు అతనికి తారతమ్య పదవులలో నియమిచుచున్నాడో ఆ విధముగానే నా శైవము నందు భక్తిని బట్టి తరతమ స్థానములను ప్రసాదించుచున్నాను.